శేరిలింగంపల్లి : రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు యువతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఒకరు ప్యాషన్ డిజైనర్ కాగా మరోకరు ఇంటర్ చదువుకునే విద్యార్ధిని. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బుదవారం చోటుచేసు కున్న సంఘటనలకు సంబందించి పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
గుజరాత్ రాష్ట్ర, వడదోర జిల్లాకు చెందిన సుకుమార్ జితెంద్రనాథ్ మండల్ కూతురు శతాబ్ది మండల్ (32) నగరంలోని గచ్చిబౌలి మైహోం విహాంగా అపార్టుమెంట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రియంకా రెడ్డి, గీతామాధూరిలతో కలిసి నివసిస్తుంది. గతంలో ఓ సాఫ్ట్వేర్ సంస్ధలో ఉద్యోగినిగా విధులు నిర్వర్తించిన శతాబ్ధి మండల్ తాజాగా ఓ ప్రైవేట్ సంస్థలో ఫ్యాషన్ డిజైనర్గా పనిచేస్తుంది.
మంగళవారం ఉదయం ప్లాట్లో ఉన్నస్నేహితులు బయటకు వెళ్లగా శతాబ్ధి మాత్రం ప్లాట్లో తన గదిలో ఉంది. రాత్రి తిరిగి ఇంటికి వచ్చిన వారిద్ధరూ గదిలో ఉన్న మండల్ ను ఎంత పిలిచినా స్పందించలేదు. దీంతో బుధవారం అపార్టుమెంట్ సెక్యూరిటీ గార్డులకు సమాచారం అందించి గది తలుపులు పగలగొట్టి చూడగా శతాబ్ధి మండల్ చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకొని కనిపించింది.
ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు.
విద్యార్ధిని ఆత్మహత్య…
ఒరిస్సా రాష్ట్రం, నవరంగ్పూర్ పరిధిలోని బార్చాందీ గ్రామానికి చెందిన దేబాండ్ రాయ్ తన భార్య బిజిలీ రాయ్, కుమార్తె దిప్తీరాయ్ (17)లతో కలిసి నగరానికి వలసవచ్చి గచ్చిబౌలి ఇందిరానగర్లో నివాసం ఉంటున్నాడు. భార్యభర్తలు వంట మనుషులుగా పనిచేస్తుండగా కూతురు దిప్తీరాయ్ చందానగర్లోని చైతన్య భారతీ కళాశాలలో ఇంటర్ చదువుతుంది.
కాగా బుదవారం ఉదయం 6 గంటలకు భార్యభర్తలు వంట పనులు చేసేందుకు బయటకు వెళ్లి మద్యాహ్నం సమయంలో పనులు ముగించుకొని ఇంటికి తిరిగివచ్చారు. ఇంట్లో ఉన్న కూతురు దిప్తీరాయ్ ఇంట్లో ఫ్యాన్కు తన చున్నీతో ఉరివేసుకొని కనిపించింది.
దేబాండ్ రాయ్ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దిప్తీరాయ్ ఆత్మహత్యకు ఇంకా కారణాలే తెలియరాలేదని, దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు పేర్కొన్నారు.