Crime News | సోషల్ మీడియాలో అసభ్యకరమైన ఫొటోలు అప్లోడ్ చేస్తామని బెదిరించి ఒక మహిళ నుంచి రూ.10.5 లక్షలు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను భల్స్వా డెయిరీ ప్రాంత వాసి సౌరవ్ (27), హోటల్ మేనేజర్ కం క్యాష్ కలెక్షన్ ఏజెంట్ మనీష్ (22)గా గుర్తించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. సైబర్ పోర్టల్లో బాధితురాలి ఫిర్యాదు మేరకు వారిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. రెండు, మూడేండ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ ఐడీ ద్వారా వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ను తాను ఆమోదించినట్లు బాధితురాలు చెప్పారు.
తన విశ్వాసం పొందిన తర్వాత సదరు వ్యక్తులు బెదిరింపులకు దిగారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేశారని, తన వద్ద రూ.10.5 లక్షలు వసూలు చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు రోహిణీ ప్రాంత డీసీపీ గుర్ ఇక్బాల్ సింగ్ సిద్ధూ తెలిపారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుల చిరునామాలతో వారి ఇండ్లపై దాడి చేసి అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. తమ విచారణలో ఫేక్ ఐడీతో ఇన్ స్టాగ్రామ్ ఖాతా క్రియేట్ చేసి అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపామని, తర్వాత బ్లాక్ మెయిల్ చేశామని సౌరవ్ అంగీకరించాడు. తన స్నేహితుడి బ్యాంకు ఖాతా నుంచి మనీ ట్రాన్స్ ఫర్ అయిందని చెప్పాడు. నిందితుల నుంచి ఒక మొబైల్ ఫోన్, డెబిట్ కార్డు స్వాధీనం చేసుకున్నారు. సదరు మొబైల్ ఫోన్ లో వందల మంది అమ్మాయిల ఫొటోలు, ఐడీలు ఉన్నట్లు గుర్తించామని డీపీసీ గుర్ ఇక్బాల్ సింగ్ తెలిపారు.