వెంగళరావునగర్ : నిషేధిత మాదక ద్రవ్యమైన హాష్ అయిల్ను విక్రయిస్తున్న ఇద్దిరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 24 సీసాల హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలను ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు.
ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద దవాఖానా సమీపంలో హాష్ ఆయిల్ విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సోమవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. జొమాటో బాయ్స్గా పనిచేస్తున్న బండారి పవన్రాజ్ (23), వాకాటి ఉదయ్కిరణ్ (23)లు హాష్ ఆయిల్ విక్రయిస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి 24 సీసాల హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం వెళ్లి శెట్టి ఉదయ్కుమార్ అనే వ్యక్తి వద్ద 100 సీసాల హాష్ ఆయిల్ను కొనుగోలు చేసి నగరంలోని పలువురుకి విక్రయించినట్లు నిందితులు అంగీకరించారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న హాష్ ఆయిల్ను ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు.