రాంచీ : శ్రద్ధా వాకర్ హత్య ఘటన మరువక ముందే, ఆ మాదిరి ఘటన మరొకటి చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను 50 ముక్కలుగా నరికి చంపేశాడు. ఈ దారుణ ఘటన జార్ఖండ్లోని సాహెబ్గంజ్ జిల్లాలోని బోరియో పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. దిల్దార్ అన్సారీ అనే యువకుడు ఓ యువతితో గత రెండేండ్ల నుంచి సహజీవనం చేస్తున్నాడు. అయితే ఇటీవలే ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అతడికి ఆమె రెండో భార్య. సహజీవనంతో సరిపెట్టుకుందామని అన్సారీ అనుకున్నాడు. కానీ అది పెళ్లి దాకా దారి తీయడంతో ఆమెను ఎలాగైనా చంపాలనుకున్నాడు. దీంతో శనివారం ఆమెను చంపి, శరీర భాగాలను 50 ముక్కలుగా నరికాడు. అనంతరం ఆ భాగాలను పలు ప్రదేశాల్లో పడేశాడు.
ఈ హత్య కేసులో తాను దొరకద్దనే ఉద్దేశంతో తన భార్య అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే సమయంలో నిర్మాణంలో ఉన్న ఓ అంగన్వాడీ వద్ద మహిళా మృతదేహం ఛిద్రమై ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సాహెబ్గంజ్ ఎస్పీ రంగంలోకి దిగారు. ముక్కలు ముక్కలుగా నరికిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో 12 భాగాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డాగ్ స్క్వాడ్తో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానంతో భర్త అన్సారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోతుగా విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. మృతురాలిని రుబీకా పహదీన్గా పోలీసులు గుర్తించారు.
పహదీన్ మిగతా శరీర భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెను ప్రలోభాలకు గురి చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ హత్యతో ఇంకెవరికైనా ప్రమేయం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.