Bull race tragedy | కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జరిగిన ఎడ్ల రేసులో విషాదం చోటుచేసుకున్నది. రెండు వేర్వేరు హోరీ హబ్బా అనే ఎడ్ల రేసులో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. శివమొగ్గ జిల్లాలోని షికారిపుర, జాడే గ్రామంలో ఈ ఘటనలు జరిగాయి. మృతులు షికారిపురకు చెందిన ప్రశాంత్, సొరబా తాలూకాలోని జాడే గ్రామానికి చెందిన ఆదిగా గుర్తించారు.
ఎడ్ల పందేలు నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసు శాఖ నుంచి అనుమతి తీసుకోలేదని సమాచారం. ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎడ్ల పోటీలను చూసేందుకు వచ్చిన ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తున్నది. దీపావళి తర్వాత జరిపే హోరీ హబ్బా ఈవెంట్లో భాగంగా ఎడ్ల పందేలు నిర్వహిస్తారు.
ఎడ్ల రేసులు నిర్వహించేందుకు నిర్వాహకులు అనుమతి తీసుకోలేదని శివమొగ్గ ఎస్పీ మిథున్ కుమార్ చెప్పారు. రెండు సంఘటనల గురించి పోలీసులకు ఎటువంటి సమాచారం లేదన్నారు. ఈ విషయంపై విచారణ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటారని కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర అన్నారు.