ముంబై : గత కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా ఆన్లైన్ స్కామ్లు (Cyber Fraud) విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్తో విద్యాధికులు, ఉన్నతోద్యోగులను కూడా సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. లేటెస్ట్గా ముంబైకి చెందిన ఓ టెకీని పార్ట్టైమ్ జాబ్ ఆఫర్తో నమ్మబలికి ఏకంగా రూ. 17 లక్షలకు స్కామర్లు మోసం చేసిన ఘటన కలకలం రేపింది.
ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న 42 ఏండ్ల టెకీని ఈనెల 3న స్కామర్లు పార్ట్టైమ్ జాబ్ ఆఫర్ పేరుతో సంప్రదించారు. హోటల్ బుకింగ్స్కు సంబంధించి పార్ట్టైం జాబ్ చేస్తూ అదనంగా సంపాదించుకోవచ్చని ఓ మహిళతో పాటు మరో వ్యక్తి బాధితుడిని మభ్యపెట్టారు. ఆపై స్కామర్లు టెలిగ్రాం ద్వారా అతడికి లింక్ పంపారు.
ముందుగా రిజిస్ట్రేషన్ చార్జీల కింద కొంత మొత్తం చెల్లించాలని అటు తర్వాత ఇతర ఫీజుల పేరుతో కొంత మొత్తం వసూలు చేశారు. ఆపై మెరుగైన రిటన్స్ వస్తాయని ఏకంగా రూ. 17.28 లక్షలు వసూలు చేశారు. కొద్దిరోజుల తర్వాత తనకు రావాల్సిన రిటన్స్ గురించి బాధితుడు నిలదీయగా స్కామర్ల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన టెకీ పోలీసులను ఆశ్రయించాడు. ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :