భోపాల్: కొనుగోలు చేసిన సిగరెట్లకు డబ్బులు కట్టాలని అడిగినందుకు ఓ దుకాణదారును దారుణంగా కొట్టి చంపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం షాహ్దోల్ జిల్లాలోని డియోలాండ్ పట్టణంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన అరుణ్ సోనీ కిరాణ దుకాణం నడుపుతున్నాడు. అందులోనే సిగరెట్లు కూడా అమ్ముతుంటాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి మోనూ ఖాన్, పంకజ్ సింగ్, విరాట్ సింగ్ అనే నలుగురు వ్యక్తులు అరుణ్ సోనీ షాప్కు వెళ్లి సిగరెట్లు కొనుగోలు చేశారు.
అనంతరం సిగరెట్లు ముట్టించుకుని డబ్బులు చెల్లించకుండానే వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దాంతో అరుణ్ సోనీ డబ్బుల కోసం వాళ్లను నిలదీశాడు. అంతే నలుగురూ కలిసి అరుణ్ సోనీని తీవ్రంగా కొట్టారు. అడ్డొచ్చిన అరుణ్ సోనీ ఇద్దరు కొడుకులపై కూడా దాడి చేసి పారిపోయారు. అనంతరం ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అరుణ్ సోనీ మృతిచెందాడు.