కొత్తగూడెం క్రైం/భద్రాద్రి కొత్తగూడెం : ఛత్తీస్గఢ్ పోలీసుల వ్యూహం ఫలించింది. మావోయిస్టులపై మరోసారి పై చేయిగా నిలిచారు. కీలకమైన మావోయిస్టు కమాండర్ టైగర్ హుంగా సుక్మా పోలీసులకు చిక్కడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కిస్టారం ప్రాంతంలోని 17 ప్రధాన సంఘటనల్లో కీలక పాత్ర పోషించిన మావోయిస్టు కమాండర్ టైగర్ హూంగాను సోమవారం అరెస్టు చేసినట్లు ఎస్పీ సునీల్ శర్మ ధ్రువీకరించారు. పాలోది ప్రాంతంలో ల్యాండ్ మైన్ ప్రూఫ్ వాహన పేల్చివేతలో టైగర్ హూంగా మాస్టర్ మైండ్ ఉందన్నారు.
ఈ పేలుడులో 9 మంది జవాన్లు నేలకొరిగారు. 2020లో టైగర్ హూంగా నేతృత్వంలో జరిగిన ఐఈడీ పేలుడు ఘటనలో సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ అసువులుబాసారు. ఇటీవల జరిగిన పలు ప్రధాన ఘటనల్లో టైగర్ హుంగా కీలకపాత్ర పోషించినట్లు ఎస్పీ తెలిపారు.