హైదరాబాద్ : నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న పూణెకు చెందిన ముగ్గురు వ్యక్తులను సిటీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు దొంగిలించబడిన వస్తువులను కొనుగోలు చేస్తుంటాడు. అరెస్టు అయిన వ్యక్తులను సంగత్ సింగ్ అజ్మీర్ సింగ్ కళ్యాణి(38), అక్షయ్ పోపట్ అదులే(26), విక్రమ్ సింగ్(29). వీరంతా పూణేకి చెందినవారు. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వివరాలను వెల్లడిస్తూ.. ప్రధాన నిందితుడు సంగత్ సింగ్ తన సహచరులతో కలిసి స్థానికంగా ఉండే ఇళ్లను గుర్తిస్తాడన్నారు. అనంతరం తాళాలు పగులగొట్టి బంగారం, నగదు, ఇతర విలువైన వస్తువులను అపహరించుకుపోతారని తెలిపారు.
తాళాలు పగులగొట్టడంలో సంగత్సింగ్ మంచి నిపుణుడు అన్నారు. పోలీసులచే అరెస్టు అయి జైలు నుంచి బయటకు వచ్చిన ప్రతీసారి సంగత్సింగ్ ఓ కొత్త ముఠాను ఏర్పరుచుకుని దొంగతనాలకు పాల్పడుతుంటాడని సీపీ తెలిపారు. నగరంలోని మారేడుపల్లి, కాచిగూడ, అంబర్పేట పోలీసు స్టేషన్ పరిధిలో సంగత్ సింగ్ ఆభరణాలను దొంగలించి పూణేలోని విక్రంసింగ్కు అమ్ముతుంటాడని చెప్పారు. నిందితుల వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన 176 గ్రాముల బంగారం, రెండు కిలోల వెండి, ఐదు మొబైల్ ఫోన్లు, ఓ బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు.