హైదరాబాద్ : నగరంలోని నానక్రామ్గూడలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఈతకు వెళ్లి ముగ్గురు
బాలురు దుర్మరణం చెందారు. గోల్ఫ్కోర్స్ చెరువు వద్ద ప్రమాదం చోటు చేసుకున్నది. మృతులను గచ్చిబౌలిలోని టెలికాంనగర్కు చెందిన షాబాజ్ (15), దీపక్ (12), పవన్ (13)గా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో టెలికాంనగర్కు చెందిన సుమారు తొమ్మిది మంది పిల్లలు ఆడుకుంటూ ఈత కొట్టేందుకు గోల్ఫ్కోర్స్ చెరువు వద్దకు చేరుకున్నారు.
వీరంతా ఒకే పాఠశాలలో చదువుకోవడంతో పాటు ఒకే ఏరియాలో నివాసం ఉంటున్నారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉన్నా.. కింద నుంచి వెళ్లారు. లోతు ఎక్కువగా ఉందని భయపడి ఆరుగురు విద్యార్థులు వెనక్కి వచ్చారు. మరో ముగ్గురు విద్యార్థులు నీటిలో దిగి ఈతకొట్టేందుకు ప్రయత్నించగా.. లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోయారు. మిగతా ఆరుగురు రోడ్డుపైకి వచ్చి ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులకు విషయాన్ని తెలుపడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకునే లోపే విద్యార్థులు నీటిలో మునిగిపోయారు.
ఆ తర్వాత స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికి తీసినట్లు పోలీసులు తెలిపారు. లోతు ఎక్కువగా ఉందని చెప్పినా వినకుండా ముగ్గురు ఈతకు వెళ్లారని, వెనక్కి రావాలని చెప్పినా వినలేదని మిగతా ఆరుగురు పిల్లల్లోని ఓ బాలుడు తెలిపాడు. నీటిలో మునిగిపోతుండగా.. రోడ్డుపైకి వెళ్లి ఓ ఆటోడ్రైవర్ను పిలిచి సహాయం చేయాలని కోరినా.. ఆ పని కాదంటూ వెళ్లిపోయాడని, మరో వ్యక్తి వచ్చి నీటిలో వెతికినా లాభం లేకపోయిందని ఆ బాలుడు తెలిపాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించినట్లు సదరు బాలుడు వివరించాడు.