పాట్నా: ప్రభుత్వ అధికారులుగా నమ్మించిన దొంగలు, స్థానికుల సహాయంతో 60 అడుగుల పొడవైన ఇనుప వంతెనను చోరీ చేశారు. బీహార్ రాష్ట్రం రోహ్తాస్ జిల్లాలోని బిక్రమ్గంజ్ సబ్డివిజన్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 1972లో అమియావర్ గ్రామంలోని అర కాలువపై 60 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పున్న ఇనుప వంతెనను నీటిపారుదల శాఖ నిర్మించింది. కాలక్రమంలో వంతెనకు తుప్పుపట్టి పలుచోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. దాని పక్కన కొత్త వంతెనను నిర్మించడంతో పాత ఇనుప వంతెనను స్థానికులు వినియోగించడం లేదు.
కాగా, ఈ ఇనుప వంతెనపై దొంగల కళ్లు పడ్డాయి. భారీ వంతెనను ఎలాగైనా చోరీ చేయాలని నిర్ణయించారు. దీని కోసం పక్కాగా ప్లాన్ వేశారు. పలు వాహనాలు, జేసీబీ, గ్యాస్ కట్టర్లతో అక్కడకు వెళ్లారు. ప్రభుత్వ అధికారులమంటూ అందరినీ నమ్మించారు. స్థానికులు, స్థానిక ప్రభుత్వ సిబ్బంది సహాయం కూడా తీసుకున్నారు. మూడు రోజులపాటు శ్రమించి ఇనుప వంతెనను పలు భాగాలుగా కట్ చేసి వాహనాల్లో తీసుకుపోయారు.
మరోవైపు 60 అడుగుల పొడవైన ఇనుప వంతెన మాయం కావడం చూసి నీటిపారుదల శాఖ అధికారులు షాక్ అయ్యారు. దీనిపై స్థానికుల నుంచి ఆరా తీశారు. ప్రభుత్వ అధికారులుగా నమ్మించిన దొంగలు దీనిని చోరీ చేసినట్లు తెలిసిందని జూనియర్ ఇంజినీర్ అర్షద్ కమల్ షంషీ తెలిపారు. దీనిపై నస్రీగంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.