జగిత్యాల : జిల్లాలో విషాదం చోటు చోటు చేసుకుంది. సంక్రాతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకుందామని వచ్చిన ఆ మహిళ పాలిట వానరం మృత్యు రూపంలో కబలించింది. కోతి దాడి నుంచి తప్పించుకోబోయి మృత్యువు ఒడికి చేరుకుంది.
వివరాల్లోకి వెళ్తే..ధర్మపురి పట్టణంలోని బ్రాహ్మణవాడకు చెందిన నారంభట్ల రాజేశ్వరి(50) అనే మహిళ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నది.
కాగా, సంక్రాంతి పండుగ సెలవుల కోసం స్వగ్రామమైన ధర్మపురికి రెండు రోజుల క్రితం వచ్చింది.
సదరు మహిళ నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ పైకి వెళ్లింది. అయితే అక్కడే ఉన్న ఓ కోతి ఆమెపై దాడి చేయడంతో భయాందోళనకు గురైన రాజేశ్వరి.. అక్కడ నుంచి కిందకు పరుగెత్తే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది.
మృతురాలికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.