అమరావతి : మద్యం మత్తులో జరుగుతున్న దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మద్యం మత్తులోనే భర్తను దారుణంగా హత్య చేసిన భార్య వైనం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రఘుదేవపురం గ్రామంలో చోటు చేసుకుంది . భర్త మూర్ఛవ్యాధితో చనిపోయాడని బుకాయించడంతో పోలీసులు భర్త మృతదేహాన్ని తీక్షణంగా పరిశీలించిన మీదట ఆ దృశ్యం చూసి అవాక్కయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన మర్రే అబ్బులు(46), ముత్యాలు భార్యాభర్తలు. వీరిద్దరికి ప్రతిరోజు మద్యం సేవించే అలవాటు ఉంది. దీంట్లో భాగంగా రాత్రి దంపతులిద్దరూ మద్యం సేవించి గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు.
మరుసటి రోజు తెల్లవారుజాము భార్య ముత్యాలు మాత్రమే ఇంటికి తిరిగి వచ్చింది. మరోవైపు రాపాక గ్రామ శివారులో ఓ మృతదేహం ఉందని పోలీసులకు ఫిర్యాదు అందడంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. మృతుడి భార్య కూడా అక్కడికి చేరుకుని తన భర్త కు మూర్ఛవ్యాధి సమస్య ఉందని, దాని వల్లే చనిపోయాడని పోలీసులకు వివరించింది. భర్త మృతదేహాన్నిదహన సంస్కారాలకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులకు అనుమానం వచ్చి మృతదేహాన్ని పరిశీలించగా మృతుడి పురుషాంగం కోసేసి ఉండడంతో ముత్యాలును విచారించగా తానే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అంగీకరించింది.
మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.