కాచిగూడ : అనుమానాస్పద స్థితిలో ఓ డాక్టర్ మృతి చెందిన విషాద సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్లోని రికొండ సోసైటీ ప్రాంతానికి చెందిన మల్లేశం కూమారుడు పీరాల సునీల్ (32) బర్కత్పురాలోని ఉడ్ల్యాండ్స్ దవాఖానలో డాక్టర్గా పనిచేస్తున్నాడు.
దవాఖానలోని డాక్టర్స్ రెస్ట్ రూమ్లో ఎవరులేని సమయంలో అనుమానస్పదస్థితిలో రెండు రోజుల క్రితం సునీల్ మృతి చెంది ఉన్నట్లు సమాచారం. దుర్వాసన రావడంతో డాక్టర్ సురేశ్గౌడ్ కాచిగూడ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం వెంటనే మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.
సునీల్ మృతికి కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాంబాబు తెలిపారు.