ఖైరతాబాద్ : ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన ఓ వివాహిత కనిపించకుండా పోయింది. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సోమాజిగూడలోని బీస్ మక్తా పోచమ్మతల్లి దేవాలయం లేన్లో సోర్నపూడి మోహన్ శ్రీనివాస్, సునంద దంపతులు నివసిస్తున్నారు.
మోహన్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా, భార్య బెంగళూరులో ఉద్యోగం చేసి గత వారం భర్త వద్దకు వచ్చింది. గత మూడు రోజులుగా ఇద్దరి మధ్య ఉద్యోగం, జీతం విషయంలో గొడవలు జరిగాయి. ఈ నెల 22న ఉద్యోగానికి వెళ్లిన మోహన్ శ్రీనివాస్ భార్య సునందకు ఫోన్ చేయగా, తాను హాస్టల్లో ఉంటానని చెప్పింది.
సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మరో సారి ఫోన్ చేయగా, స్విచ్ఛాఫ్ వచ్చిందని, ఇంట్లో ఆమె బట్టలు, వస్తువులు కనిపించలేదు. తెలిసిన వారు, బంధువుల, స్నేహితుల వద్ద ఆరా తీసినా ఫలితం లేదు. దీంతో మంగళవారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.