వెంగళరావునగర్, ఆగస్టు 20 : పిల్లలకు డ్యాన్స్ నేర్పే ఓ డ్యాన్స్ మాస్టర్ ఉపాధి కరువై నేర ప్రవత్తిలోకి అడుగు పెట్టాడు. చైన్ స్నాచింగ్ చేసి 24 గంటల వ్యవధిలోనే పోలీసులకు చిక్కాడు. ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలను ఇన్స్పెక్టర్ సైదులు, డిటెక్టవ్ ఇన్స్పెక్టర్ పి.వి.రాంప్రసాద్ వెల్లడించారు. కరీంనగర్ జిల్లా జిమ్మికుంట మండలంపెద్దపల్లికి చెందిన డి.సుచరిత మాదాపూర్లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తుంది.
మధురానగర్ కాలనీలోని హరిణి ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్న సుచరిత రోజు మాదిరిగానే తాను పనిచేస్తున్న సంస్థకు వెళ్లేందుకు గురువారం ఉదయం మధురానగర్ కాలనీలోని మెట్రో స్టేషన్కు చేరుకుని లిఫ్ట్ కోసం వేచి చేస్తుంది. ఈ సమయంలో నల్లగొండ జిల్లా నార్కట్పల్లికి చెందిన చింత వినోద్(27) వెనుక నుంచి వచ్చి సుచరిత మెడలోని రూ.45వేల విలువ చేసే బంగారు గొలుసును తెంచుకుపోయాడు.
దీంతో బాధితురాలు ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మెట్రో స్టేషన్ వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశారు. ఎంబీఏ పూర్తి చేసి డ్యాన్స్ మాస్టర్ అయిన చింత వినోద్ మధురానగర్లోనే శ్రీ సాయి బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు. పిల్లలకు డ్యాన్స్ నేర్పుతూ ఉండేవాడు. అయితే కరోనాతో ఉపాధి లేక ఆర్ధిక ఇబ్బందులతో చైన్ స్నాచింగ్కు పాల్పడ్డాడని డీఐ తెలిపారు. ఈ మేరకు నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.