మారేడ్పల్లి : గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో మూడేళ్ల చిన్నారి కీర్తనను కిడ్నాప్ చేసిన సమీప బంధువుతో పాటు, సహకరించిన మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాప్కు గురైన చిన్నారి కీర్తనను 10 గంటల్లోనే స్థానిక పోలీసులు, టాస్క్ఫోర్స్ పోలీసులు కేసును చేధించి తల్లిదండ్రులకు అప్పగించారు.
గోపాలపురం ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం…సీతాఫల్మండి ప్రాంతానికి చెందిన శిరివెల్లు సాయిరాం (25) రెజిమెంటల్బజార్లో అక్వేరియం షాపు నడపిస్తుంటాడు. సాయిరాం కిడ్నాప్కు గురైన చిన్నారి కీర్తన తల్లికి చిన్నాన్న కుమారుడు. బంధువు కావడంతో తరుచుగా వీరి ఇంటికి వచ్చి చిన్న చిన్న సహాయాలు చేస్తుంటారు.
వీరి దగ్గర మరింత మెప్పు పొంది…దగ్గర కావాలనే ఉద్దేశ్యంతో వీరి పిల్లలను కిడ్నాప్ చేసి తానే విడిపించానని నాటకం ఆడాలని పథకం పన్నాడు. ఇందులో భాగంగా తనకు వరసకు సోదరుడైన సఫిల్గూడ ప్రాంతానికి చెందిన 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడిని (16), ఈ బాలుడికి స్నేహితులైన అదే ప్రాంతానికి చెందిన పాలిటెక్నిక్ చదువుతున్న (17), మరో మైనర్ బాలుడు, ఇంటర్ చదువుతున్న (17) మరోబాలుడితో కిడ్నాప్ కు పథకం రచించాడు.
దీని కోసం బాలిక ఇళ్లు చూపించడంతో పాటు ఎలా కిడ్నాప్ చేయాలి. ఎక్కడ బాలికను దాచి పెట్టాలి అని మొత్తం వీరు ముగ్గురికి వివరించారు. ఇద్దరు నింధితులు శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో చిన్నారి ఆడుకుంటుం డగా ద్విచక్రవాహనం పై తీసుకొని వెళ్లిపోయారు. జీడిమెట్లలో నివసించే సాయి రాం స్నేహితుడైన గువ్వల నితిన్ కుమార్ ఇంటికి తీసుకొని వెళ్లి బాలికను కొద్ది సేపు చూసుకోవాలని చెప్పి అక్కడ ఉంచారు.
వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు..
కిడ్నాప్కు గురైన చిన్నారి కీర్తన విషయం తెలుసుకున్న గోపాలపురం పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. వెంటనే టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు బృందాల వారిగా విడిపోయి సీసీ కెమెరాల ద్వారా నింధితులను పట్టుకున్నారు. పోలీసుల విచారణలో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి.
సాయిరాం మొదట శ్రీనివాస్, ఉమల కుమారుడు తరుణ్ (6) ను కిడ్నాప్ చేయాలని పథకం పన్నారు. అందుకోసం తరుణ్ చదివే పాఠశాల వద్దకు ఈ నెల 21న ఇందులో ఉన్న ముగ్గురు నిందితులను పంపించాడు. తరుణ్ను ఇంటికి తీసుకొని వెళ్తామని పాఠశాల సిబ్బందికి చెప్పడం వారు కొత్త వారు కావడంతో వారితో పంపించలేదని పోలీసుల విచారణలో వెల్లడింది.
అటు తర్వాత కీర్తన కిడ్నాప్ కథను నడిపించాడు. అదే క్రమంలో పోలీసులకు సహకరిస్తున్నట్లుగా నాటకం ఆడుతూ వారితోనే ఉన్నారు. చివరకు అతన్నే అనుమానించిన పోలీసులు అదుపుతోకి తీసుకొని విచారించగా అసలు సూత్రదారి తానే అని తేలింది.