మాదన్నపేట : ప్రమాదవశాత్తు బాలుడు పిల్లర్ కోసం తవ్విన గుంతలో పడి మృత్యువాత పడిన సంఘటన మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుర్మగూడ డివిజన్ మాదన్పనేట చంద్రయ్య హాట్స్ ప్రాంతానికి చెందిన గఫ్పార్ ఆటో డ్రైవర్. ఇతనికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు.
కుమారుడు అఫ్లాన్ అబ్దుల్ గఫ్ఫార్ (8) ఆదివారం మధ్యాహ్నం ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. కొద్దిసేపటి తరువాత కాళ్లు కడుక్కుందామని పిల్లర్ల కోసం తవ్విన గుంతలో దిగబోయి ప్రమాదవశాత్తు పూర్తిగా మునిగిపోయాడు.
వెంటనే స్థానికులు గుంతలోనుంచి తీసి ఆపస్మారక స్థితిలోకి చేరిన బాలున్ని చికిత్స కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు మాదన్నపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.