లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. యూపీలోని భాగ్పట్ జిల్లాలో టీనేజ్ బాలికపై లైంగిక దాడి ఘటన వెలుగుచూసింది. ఎనిమిదో తరగతి చదివే బాలిక తన తండ్రి, సోదరితో కలిసి నివసిస్తోంది. ఇంటి లోపల బాలిక నిద్రిస్తుండగా నిందితుడు (45) ఆమెను బయటకు తీసుకువచ్చి దారుణానికి పాల్పడ్డాడని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలిక అరుపులు విని బయటకు వచ్చిన తండ్రి అడ్డగించగా నిందితుడు ఆయనపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. బాలికతో పాటు ఆమె తండ్రిని బెదిరించిన నిందితుడు ఘటనా స్ధలం నుంచి పారిపోయాడు. తొలుత ఫిర్యాదు చేసేందుకు వెనుకాడిన బాధితురాలి కుటుంబం ఆపై ధైర్యం కూడతీసుకుని నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక మహారాష్ట్రలో జరిగిన మరో ఘటనలో వదిన స్నానం చేస్తుండగా వీడియో తీసిన మరిది వీడియోను వైరల్ చేస్తానని బెదిరిస్తూ మహిళపై లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. మహారాష్ట్రలోని పుణేలో ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.