డెహ్రాడూన్ : తక్కువ కులానికి చెందిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిందనే ఆగ్రహంతో బాలిక(18)ను స్వయంగా ఆమె సోదరులు హత్య చేసిన ఘటన డెహ్రాడూన్లో వెలుగుచూసింది. హత్య ఘటనలో బాలిక ఇద్దరు సోదరులతో పాటు సహకరించిన ఆమె వదినను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 20న డెహ్రాడూన్ శివార్లలోని అటవీ ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
మృతదేహం కుళ్లిన స్ధితిలో లభ్యం కావడంతో బాలిక హత్య ఘటన నెల కిందట జరిగి ఉంటుందని పోలీసులు అనుమానించారు. 60 రిసార్ట్స్లో తనిఖీలు, 150 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించిన మీదట ఈ కేసును ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిహార్కు చెందిన బాలిక తన చిన్నన్నయ్యతో కలిసి డెహ్రాడూన్లోని పెద్దన్న, వదిన ఇంటికి వచ్చారు.
నవంబర్ 6న అన్న, వదినలతో కలిసి బాలికను గొంతు పిసికి చంపామని ఆపై మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేశామని చిన్నన్న వెల్లడించాడు. హత్య అనంతరం తాను బిహార్కు తిరిగివెళ్లానని తెలిపాడు. బిహార్లోని తన స్వగ్రామం మోతిహారిలో తక్కువ కులానికి చెందిన వ్యక్తితో మృతురాలికి సంబంధం ఉండటం ఈ హత్యకు దారితీసింది. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.