పుణే : కరోనా మహమ్మారి కట్టడికి లాక్డౌన్ ప్రకటించడంతో తనకు జీవనాధారమైన టీస్టాల్ మూతపడి దిక్కుతోచని స్థితిలో ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ల చోరీకి తెగబడ్డాడు. పుణేకు చెందిన రమేష్ సింగ్ (21) టీస్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కరోనా వైరస్ కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన నియంత్రణలు విధించడంతో రమేష్ టీస్టాల్ మూతపడింది. దీంతో నగరంలోని బండ్ గార్డెన్ పరిసర ప్రాంతాల్లో రమేష్ మొబైల్ ఫోన్లను చోరీ చేయడం ప్రారంభించాడు.
నిందితుడి కదలికలపై సమాచారం అందడంతో కొరేగావ్ పార్క్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. టీస్టాల్ మూతపడటంతో పొట్టపోసుకునేందుకు నిందితుడు మొబైల్ ఫోన్ల చోరీ మార్గాన్ని ఎంచుకున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి రూ 16,000 నుంచి రూ 20,000 విలువ చేసే నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్లను అమ్మేందుకు నిందితుడు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నామని పుణే పోలీసులు తెలిపారు.