చెన్నై : తమిళనాడులోని పెరంబలూరు జిల్లా కోర్టు వద్ద దారుణం జరిగింది. విడాకుల కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన భార్యపై భర్త కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని పట్టుకుని, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.
సుధా, కామరాజ్ అనే ఇద్దరు దంపతులు తమ విడాకుల కేసులో పెరంబలూరు కోర్టుకు హాజరయ్యేందుకు శుక్రవారం వచ్చారు. అయితే వీరిద్దరూ యాధృచ్చికంగా ఒకే బస్సులో రావడంతో.. కామరాజ్ తన భార్యను గుర్తించాడు. కోర్టు బస్టాప్లో సుధా దిగగానే.. ఆమె వెనుకాలే వచ్చిన కామరాజ్ కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
అదే బస్సులో ఓ పోలీసు కూడా ప్రయత్నిస్తున్నాడు. ఈ ఘటనను గమనించిన సదరు పోలీసు అప్రమత్తమయ్యాడు. కోర్టు వద్ద విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులు, ఈ పోలీసు ముగ్గురూ కలిసి కామరాజ్ను పట్టుకున్నారు. కామరాజ్ దాడిలో ఓ పోలీసు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై కూడా కామరాజ్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధిత మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గత కొన్నేండ్ల నుంచి వీరిద్దరూ విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఆ కేసు తుది దశలో ఉందని పోలీసులు తెలిపారు.