చెన్నై: లైంగిక వేధింపులకు గురైన విద్యార్థిని ఆత్మహత్య నేపథ్యంలో ఒక టీచర్ సూసైడ్ చేసుకున్నాడు. తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. గత వారం 12వ తరగతి విద్యార్థిని స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ‘లైంగిక వేధింపుల కారణంగా కరూర్ జిల్లాలో చనిపోయే చివరి అమ్మాయి నేనే కావాలి. నా ఈ నిర్ణయానికి కారణమెవరో చెప్పడానికి భయపడుతున్నాను. నేను ఈ భూమిపై చాలా కాలం జీవించాలని, ఇతరులకు సహాయం చేయాలని కోరుకున్నాను. కానీ ఇప్పుడు నేను ఇంత త్వరగా ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాను’ అని సూసైడ్ నోట్ రాసింది.
కాగా, విద్యార్థిని ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె స్కూల్లోని ఉపాధ్యాయులు, సిబ్బందిని ప్రశ్నించారు. విద్యార్థిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలున్న మ్యాథ్స్ టీచర్ 42 ఏండ్ల శరవణన్ కూడా పోలీసులు ఇంటరాగేట్ చేశారు. అయితే ఆయనపై ఎలాంటి అనుమానం లేదని పోలీసులు తెలిపారు.
మరోవైపు మ్యాథ్స్ టీచర్ శరవణన్ బుధవారం రాత్రి తిరుచ్చిలోని మామ ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థిని మరణంపై విద్యార్థులు, ప్రజలు తనను నిందిస్తూ ఎగతాళి చేస్తుండటంతో తాను ఇబ్బందిపడుతున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఆ బాలిక తన సూసైడ్ నోట్లో ఎవరి పేరు చెప్పనప్పటికీ తనపైనే అనుమానాలు తలెత్తాయని, ఇది భరించలేని తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అందులో పేర్కొన్నాడు.