బెంగళూరు: మాజీ భార్య, ఒక యువకుడ్ని మాజీ భర్త, అతడి సోదరుడు కలిసి స్తంభానికి కట్టి పలు గంటలపాటు కొట్టారు. కర్ణాటకలోని మైసూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. కొవ్లాండే పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన ఒక మహిళకు స్థానిక వ్యక్తితో కొన్నేండ్ల కిందట వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు. ఐదేండ్ల కిందట భార్యాభర్తలు విడిపోయారు. దీంతో 30 ఏండ్ల మహిళ తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నది.
కూలీ పనులు చేసుకునే ఆ మహిళకు పొరుగు గ్రామానికి చెందిన 24 ఏండ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ నెల 25న ఆ యువకుడ్ని మహిళ తన ఇంటికి పిలిచింది. రాత్రి వేళ వారిద్దరు కలిసి ఉన్నట్లు స్థానికంగా ఉంటున్న మాజీ భర్తకు తెలిసింది. వారి మధ్య వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో సోదరుడితో కలిసి అతడు ఆమె ఇంటికి వచ్చాడు. మాజీ భార్యను, ఆ యువకుడ్ని ఇంటి నుంచి బయట ఈడ్చి కరెంట్ స్తంభానికి కట్టారు. వారిద్దరిని పలు గంటలపాటు కొట్టారు. స్థానికులు చోద్యం చూశారే తప్ప ఎవరూ కాపాడేందుకు ప్రయత్నించలేదు.
మరునాడు గ్రామ పెద్దకు ఈ విషయం తెలియడంతో జోక్యం చేసుకుని వారిద్దరిని విడిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు మహిళ ఫిర్యాదుతో ఆమె మాజీ భర్తను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న అతడి సోదరుడి కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.