Bengaluru CEO | కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఏఐ కంపెనీ సీఈవో (Bengaluru CEO) సుచనా సేథ్ (Suchana Seth) తన కుమారుడ్ని హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గోవాలోని స్టే అపార్ట్మెంట్లో 4 ఏళ్ల కుమారుడ్ని సుచనా అత్యంత దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై గోవా పోలీసులు (Goa Police) దర్యాప్తు ముమ్మరం చేశారు.
సుచనా ఓ టిష్యూ పేపర్పై లేఖ రాసి బాలుడి మృతదేహం పక్కన పెట్టినట్లు గోవా పోలీసులు తాజాగా గుర్తించారు. ఐలైనర్ (eyeliner) వాడి బాలుడి కస్టడీ అంశాన్ని టిష్యూ పేపర్ ( tissue paper)పై రాసింది. ఏం జరిగినా సరే కుమారుడు తన వద్దే ఉండాలని పేర్కొంది. కోర్టు విడాకులు మంజూరు చేసినా.. కస్టడీ హక్కు మాత్రం తనకే దక్కాలని అందులో రాసినట్లు గోవా పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఆ లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు చెప్పారు.
కాగా, సునచాకు వెంకట రామన్తో 2010లో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే ఇద్దరి మధ్య నెలకొన్న మనస్పర్థాల కారణంగా విడాకులకు అప్లై చేశారు. 2022 నుంచి విడాకుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో కుమారుడు ఎవరి వద్ద ఉండాలనే దానిపై వాదలను జరగ్గా.. తల్లి వద్ద ఉండేందుకు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అయితే, ప్రతి ఆదివారం బాబుతో ఉండేందుకు తండ్రికి కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు ఆదేశాలు సుచనాను తీవ్ర నిరాశకు గురిచేశాయి. బాలుడు తన తండ్రితో ఉండేందుకు ఆమెకు నచ్చలేదు. భర్తతో ఉన్న విభేదాలు, కోర్టు ఆదేశాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆమె.. చివరికి తన కుమారుడిని హత్య చేసింది.
ఏం జరిగిందంటే..
జనవరి 6 నుంచి 10 వరకు గోవా రాజధాని పనాజీలోని స్టే అపార్ట్మెంట్లో బస చేసేందుకు సుచనా సేథ్ బుక్ చేసుకుంది. అయితే జవనరి 7న సాయంత్రం ఉన్నట్టుండి ఖాళీ చేసింది. క్యాబ్ బుక్ చేసుకుని అర్జెంట్గా ఒంటరిగా సూట్కేసుతో బెంగళూరు బయలుదేరింది. అయితే ట్రాఫిక్ జామ్ కావడంతో అర్జెంట్ పని ఉంటే ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తానని క్యాబ్ డ్రైవర్ సూచించాడు. ఆలస్యమైనప్పటికీ క్యాబ్లోనే బెంగళూరు వెళ్తానని ఆమె చెప్పింది.
మరోవైపు సుచనా బస చేసిన రూమ్లో రక్తం మరకలు ఉండటం, ఆమె ఒంటరిగా వెళ్లడాన్ని సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో క్యాబ్లో వెళ్తున్న సుచనాతో గోవా పోలీసులు మాట్లాడారు. ఆమె కుమారుడి గురించి ఆరా తీయగా తన బంధువుల వద్ద ఉంచినట్లు చెప్పింది. అనుమానించిన పోలీసులు క్యాబ్ డ్రైవర్తో మాట్లాడారు. సమీపంలోని పోలీస్ స్టేషన్కు ఆమెను తీసుకెళ్లాలని చెప్పారు.
కాగా, క్యాబ్ అప్పటికే కర్ణాటకలోకి ప్రవేశించడంతో ఆ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ వద్దకు డ్రైవర్ తీసుకెళ్లాడు. పోలీసులు సుచనా సూట్కేస్ను తనిఖీ చేయగా అందులో కుమారుడి మృతదేహం కనిపించింది. అయితే తన కుమారుడ్ని తాను చంపలేదని, ఉదయం నిద్ర లేచేటప్పటికే కుమారుడు మరణించి ఉన్నట్లు పోలీసులకు చెప్పింది. అయితే కుమారుడు భర్త పోలికలతో ఉండటంతో ఎక్కువ మోతాదులో దగ్గు మందు ఇచ్చి, ఊపిరాడకుండా చేసి హత్య చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Cocaine | ముంబై ఎయిర్పోర్ట్లో రూ.40 కోట్లు విలువ చేసే కొకైన్ పట్టివేత
Akshay Kumar | ముంబై మెట్రోలో ప్రయాణించిన అక్షయ్ కుమార్.. వీడియో
Delhi | ఢిల్లీలో అత్యంత శీతల వాతావరణం.. 3 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు