వెంగళరావునగర్ : అతను బీటెక్ చదివాడు..మోసాలు చేయడంలో మాత్రం హైటెక్ స్థాయిలో ఆరితేరాడు..రాత్రి వేళల్లో బ్యాంకు ఏటీఎం డిపాజిట్ సెంటర్ల వద్ద కు వచ్చే అమాయకులైన ఖాతాదారులను బురిడీ కొట్టించి డబ్బులు దండుకొని ఉడాయిస్తుంటాడు. ఏటీఎంలో నగదు జమ చేయకుండా నగదు తనకిస్తే ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేస్తానని నమ్మించి సెల్పోన్కు నకిలీ మెస్సేజ్ పంపి ఉడాయిస్తాడు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న ఇతని మోసాల పై ఫిర్యాదులు రావడంతో… మోసగాడిని ఎస్.ఆర్.నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..తూర్పుగోదావరి జిల్లా రాజోలి మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన ఇంటిపల్లి రామారావు అలియాస్ రాము(27) బీటెక్ చదివి ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసేవాడు. కేపీహెచ్బీ కాలనీలోని లగ్జరీ బాయిస్ హాస్టల్లో ఉంటున్నాడు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏటీఎం కేంద్రాలు, ముఖ్యంగా ఏటీఎం డిపాజిట్ కేంద్రాలను ఎంచుకున్నాడు.
ఈ క్రమంలో నగరంలోని భోలక్పూర్కు చెందిన జైత్వాల గౌతమ్అనే యువకుడు ఈ నెల 12 న సాయంత్రం 6.30 గంటలకు ఎస్.ఆర్.నగర్లోని యాక్సిస్ బ్యాంక్ఏటీఎంలో రూ.లక్ష డిపాజిట్ చేసేందుకు వచ్చాడు. అక్కడే మకాం వేసిన రామారావు తనకు నగదు అత్యవసరం ఉందని, దవాఖానాలో బిల్లు కట్టాలని నమ్మించాడు. నగదు తనకిస్తే వెంటనే ఆన్లైన్ ద్వారా డబ్బు పంపుతానని నమ్మించాడు. ఇతని మాటలు నిజమని నమ్మిన గౌతమ్అందుకు అంగీకరించాడు.
నగదు తీసుకున్న రామారావు ఆన్లైన్ ద్వారా నగదు పంపినట్లు నకిలీ మెస్సేజ్ను గౌతమ్కు పంపి అక్కడి నుంచి ఉడాయించాడు. నగదు జమకాకపోగా, పంపిన మెస్సేజ్ న కిలీదని గుర్తించిన గౌతమ్ ఎస్ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ఇంటిపల్లి రామారావును అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రూ.95 వేల నగదు, ఒక సెల్పోన్ను స్వాధీనం చేసుకున్నారు.
రామారావు నేర చరిత్ర
సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అమాయకులను మోసం చేయడం ఇంటిపల్లి రామారావు తన ప్రవృత్తిగా మార్చుకున్నాడు. 2018-2019 మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా 27 కేసుల్లో రామారావు నిందితుడు. 2019లో ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ ఫరిధిలో ఒకరిని మోసం చేసి నగదు కాజేసినందుకు పోలీసులు రామారావును అరెస్టు చేసి జైలుకు పంపారు.
జైలు నుంచి తిరిగి వచ్చిన నిందితుడు తన ప్రవృత్తిని మార్చుకోకుండా ఇదే తరహా మోసాలకు పాల్పడుతున్నాడు. జైలు నుంచి వచ్చిన అనంతరం వివిధ ప్రాంతాల్లో 5 సార్లు మోసాలకు పాల్పడ్డాడు. ఇప్పటి వరకు రూ.12,09,000 లను బాధితుల నుంచి దండుకున్నాడు. తాజా కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.