చెన్నై : టీచర్ తిట్టిందనే కోపంతో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివే విద్యార్ధిని ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకిన ఘటన తమిళనాడులోని కరూర్లో వెలుగుచూసింది. బాలికను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగా తనను వీడియో తీయాలని ఓ బాలిక కోరడంతో తాను వీడియో తీశానని దీంతో టీచర్ తనను మందలించారని బాధితురాలు తెలిపింది.
తనను వీడియో తీయాలని కోరడంతోనే ఆ పని చేశానని టీచర్కు తెలుపగా ఆమె తన మాటలను నమ్మకుండా అసత్యాలు చెబుతానని మండిపడటంతో మనస్ధాపానికి గురయ్యానని బాధితురాలు తెలిపింది. అందరి ముందు తనను తీవ్రంగా అవమానించడంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నానని పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.