పరీక్షలు పాసవడానికి కొందరు విద్యార్థులు చాలా హైటెక్ పద్ధతులు వాడుతున్నారు. తాజాగా భోపాల్లో జరిగిన ఎంబీబీఎస్ పరీక్షలో కూడా ఇలా చీటింగ్ చేస్తున్న విద్యార్థులు బయటపడ్డారు. ఇక్కడి మహాత్మాగాంధీ మెడికల్ కాలేజ్లో ఒక విద్యార్థి పరీక్ష రాస్తున్నాడు. అతను గత 11 ఏళ్లుగా ఎంబీబీఎస్ చదువుతూనే ఉన్నాడు. కానీ ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. ఇదే అతని చివరి అవకాశం కావడంతో రిస్క్ తీసుకున్నాడు.
పరీక్షలకు ముందే ఒక ఈఎన్టీ సర్జన్ సాయంతో తన చెవిలో ఒక మైక్రో బ్లూటూత్ పరికరాన్ని అమర్చుకున్నాడు. దాని సాయంతో పరీక్ష రాస్తున్నాడు. అదే సమయంలో దేవీ అహల్యాబాయి యూనివర్సిటీకి చెందిన తనిఖీ బృందం ఆ ఎగ్జామ్ సెంటర్లో తనిఖీలు చేసింది. ఈ బృందానికి అహల్యాబాయి వర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్ రచన ఠాకూర్ నేతృత్వం వహించారు. తనిఖీల్లో భాగంగా సదరు విద్యార్థిని వెతగ్గా.. అతని ప్యాంటు లోపల మరో జేబు ఉన్నట్లు వాళ్లు గుర్తించారు. దానిలో ఒక మొబైల్ ఫోన్ కూడా దొరికింది.
ఆ మొబైల్ ఆన్ చేసి ఉండటం, అలాగే ఒక బ్లూటూత్ డివైజ్కు కనెక్ట్ ఉండటం అధికారులు గుర్తించారు. కానీ అతని వద్ద ఎలాంటి బ్లూటూత్ డివైజ్ దొరకలేదు. దీంతో ఆ విద్యార్థిని గట్టిగా ప్రశ్నించారు. అప్పుడు తను సర్జరీ ద్వారా చెవిలో ఒక బ్లూటూత్ పరికరాన్ని అమర్చుకున్నట్లు వెల్లడించాడు.