ముంబై: స్కూల్ లిఫ్ట్లో ఇరుక్కుని ఒక ఉపాధ్యాయురాలు మరణించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఉత్తర ముంబై శివారు ప్రాంతమైన మలాడ్లోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ హై స్కూల్లో 26 ఏళ్ల జెనెల్ ఫెర్నాండెజ్, టీచర్గా పని చేస్తున్నది. శుక్రవారం మధ్యాహ్నం ఆ స్కూల్ ఆరో అంతస్తులో క్లాస్ ముగిసిన తర్వాత రెండో ఫ్లోర్లోని స్టాఫ్ రూమ్కు వెళ్లేందుకు లిఫ్ట్ వద్దకు ఆమె వచ్చింది.
అయితే ఆ టీచర్ లిఫ్ట్లోకి ఒక కాలు పెట్టిన వెంటనే డోర్లు దగ్గరకు వచ్చి పైన ఉన్న ఏడో అంతస్తుకు అది కదిలింది. దీంతో లిఫ్ట్ డోర్ బయట శరీరం, లోపల కాలు ఉన్న ఆమె ఆ లిఫ్ట్, అది వెళ్లే గోడ మధ్యలో చిక్కుకుని నలిగిపోయింది. సహాయం కోసం గట్టిగా కేకలు వేసింది. స్పందించిన మిగతా టీచర్లు, విద్యార్థులు ఆ ఉపాధ్యాయురాలిని రక్షించేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ టీచర్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
కాగా, ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతిపై ఏదైనా అనుమానం కలిగితే ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు.