చండీఘఢ్ : ఇంటి వద్ద మద్యం సేవించవద్దని వారించినందుకు సోదరుడినే హత్య చేసిన వ్యక్తి ఉదంతం హర్యానాలో చోటుచేసుకుంది. చునాబత్తి గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. మద్యం సేవించడంపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు సోదరుడిపై నిందితుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. బాధితుడు అజిత్ సింగ్ గా గుర్తించగా నిందితుడు సత్నాం సింగ్ ఫేస్ బుక్ వేదికగా వీడియోను అప్ లోడ్ చేసి నేరాన్ని అంగీకరించాడు. కొవిడ్-19 మహమ్మారితో ఇద్దరు సోదరులు నిరుద్యోగులుగా మారడంతో తరచూ కుటుంబంలో ఘర్షణలు జరుగుతుండేవి.
బ్యాంక్ సెక్యూరిటీ గార్డుగా పనిచేసే సత్నాం సింగ్ వద్ద లైసెన్డ్ గన్ ఉంది. శనివారం సత్నాం తన స్నేహితుడితో కలిసి ఇంటికి చేరుకుని తన గదిలో మద్యం సేవించాడు. ఇంట్లో మద్యం సేవిస్తే తండ్రి అంగీకరించడని సోదరుడు అజిత్ వారించాడు. ఆ కోపం మనసులో పెట్టుకున్న సత్నాం రాత్రి భోజనం అనంతరం నిద్రిస్తున్న అజిత్ పై తుపాకీతో కాల్పులు జరిపాడు. అజిత్ ను హుటాహుటిన దవాఖానకు తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.