చండీగఢ్: తల్లికి ఎవరితోనో సంబంధం ఉందని అనుమానించిన కుమారుడు ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. హర్యానాలోని హిసార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 40 ఏళ్ల సోనా దేవి భర్త చనిపోయాడు. దీంతో ఆమె హిసార్ జిల్లా గర్హిలోని తన పుట్టింటికి తిరిగి వెళ్లింది. అక్కడి ప్రైవేట్ స్కూల్లో వార్డెన్గా పని చేసింది. ఆరు నెలల కిందట ఆ పని మానేసింది. గ్రామంలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నది.
కాగా, 21 ఏళ్ల కుమారుడు ప్రవేశ్, సోనేపట్లోని జట్వాడ మొహల్లాలో ఉంటున్నాడు. అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి తల్లి సోనా దేవిని చూసి వెళ్లేవాడు. అయితే తల్లి ఫోన్లో ఎవరితోనో చనువుగా మాట్లాడం గమనించాడు. ఆమెకు ఆ వ్యక్తితో సంబంధం ఉందని అనుమానించాడు. ఈ నెల 6న తల్లి ఇంటికి వచ్చిన ప్రవేశ్, కత్తితో ఆమెను పొడిచాడు. చనిపోయిందన్న నిర్ధారణ కోసం ఆమె గొంతు కూడా నొక్కాడు. మృతదేహాన్ని మంచం కింద ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మరోవైపు సోనా దేవి ఉంటున్న అద్దె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో బుధవారం ఆ ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడకు వచ్చిన పోలీసులు ఆ ఇంట్లోని మంచం కింద ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించారు. కాగా, సోనా దేవిని ఆమె కుమారుడే హత్య చేశాడని ఆమె సోదరుడు ఆరోపించాడు. దీంతో రోహ్తక్లో ఉన్న ప్రవేశ్ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.