సుల్తాన్బజార్ : అర్ధరాత్రి సమయంలో వ్యాయామం ఏంటని అడిగిన పాపానికి నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లిని సైకోగా మారిన కొడుకు అతి దారుణంగా హతమార్చిన ఘటన సుల్తాన్బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ భిక్ష పతి, ఎస్ఐ శ్రీకాంత్రెడ్డిలు తెలిపిన వివరాల ప్రకారం..
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం, మల్కాపూర్ గ్రామానికి చెందిన పాపమ్మ(45) తన భర్త, కుమారుడు కొండ సుధీర్కుమార్ (25), కూతురు (23) తో కలిసి 20 ఏండ్ల క్రితం జీవనోపాధిని వెతుక్కుంటూ నగరానికి వచ్చి రాంకోఠిలోని దిగంబర్ జైన్ మందిరం సమీపంలో నివసిస్తుంది.
పాపమ్మ భర్త అనారోగ్యంతో ఎనిమిదేళ్ళ క్రితం చనిపోయాడు. భర్త మరణంతో పాపమ్మ ఇండ్లలో పనిచేస్తూ పిల్లల్ని చదివించింది. డిగ్రీ పూర్తిచేసిన కొడుకు సుధీర్ కుమార్ డి కొంతకాలం జోమాటోలో పని చేసి ప్రస్థుతం ఖాళీగా ఉంటున్నాడు. ఇదిలా ఉండగా గత కొంత కాలంగా సుధీర్ మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో సైకోగా ప్రవర్తిస్తున్నాడు.
ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఇంట్లో సుధీర్ వ్యాయామం చేస్తూ తల్లి పాపమ్మకు కనిపించాడు. ఇంత అర్దరాత్రి వ్యాయామం ఏంటని తల్లి కుమారుడిని ప్రశ్నించింది. దీంతో కోపోద్రిక్తుడైన సుధీర్ విచక్షణ కోల్పోయి తన చేతిలో ఉన్న డంబుల్తో పలుమార్లు తల్లి తలపై బాదడంతో తల నుజ్జునుజ్జు అయి పాపమ్మ అక్కడికక్కడే మరణించింది.
ఈ ఘటనను ఆపేందుకు ప్రయత్నించిన సోదరి పై కూడా దాడి చేయడంతో స్వల్ప గాయాల య్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మరణించిన పాపమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కాగా మానసిక స్థితి సరిగ్గా లేని కొండ సుధీర్కుమార్ను ఎర్రగడ్డ మానసిక దవాఖానకు తరలించారు.