Nizamabad | మాక్లూర్ : విలాసాలకు అడ్డు వస్తున్నాడని నవమాసాలు మోసి కనిపెంచిన కొడుకు( Son )నే హతమార్చిందో తల్లి.. మద్యం మత్తులో కుమారుడి గొంతు నులిమి.. కెనాల్లో పడేసింది. ఈ హృదయ విదారకర ఘటన నిజామాబాద్ జిల్లా( Nizamabad dist ) మాక్లూర్ మండలం దాస్నగర్ వద్ద బుధవారం చోటు చేసుకున్నది.
పోలీసులు( Police ) తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని నాగారాం సమీపంలో గల సంతోష్ నగర్ కాలనీలో నివాసం ఉండే లావణ్య, భరత్ దంపతులకు కుమారుడు రోహిత్ (8 )ఉన్నాడు. లావణ్య మద్యానికి బానిస కావడంతో పాటు విలాసాలకు అలవాటు పడింది. మంగళవారం సాయంత్రం లావణ్య కుమారుడిని తీసుకొని ఇంటి నుంచి బయల్దేరింది. తన విలాసాలకు అడ్డు వస్తున్నాడని భావించిన తల్లి.. మద్యం మత్తులో రోహిత్ గొంతు నులిమి, నిజాం సాగర్ కెనాల్లో పడేసింది.
మత్తులో ఉన్న ఆమె తెల్లవారేసరికి అక్కడే ఉండడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను విచారించి భర్తకు సమాచారం అందించారు. భర్త భరత్ ఫిర్యాదు మేరకు నిందితురాలిని ఆదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం రోహిత్ మృతదేహాన్ని జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. ఆమె మద్యం మత్తులో హత్య చేసిందా? లేదా ఎవరితోనైనా కలిసి హత్య చేసిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని నార్త్ రూరల్ సీఐ నరహరి,ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు.