రఘునాథపల్లి, ఏప్రిల్ 13: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తు లు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని దారుణంగా హత్యచేశారు. అడ్డుకోబోయిన మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడిగొండకు చెందిన వంగాల దినేశ్(25) హైదరాబాద్లోని ఉప్పల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉంటున్నాడు. ఉగాది పండుగకు స్వగ్రామానికి వచ్చాడు. తండ్రి సోమనర్సయ్య, బాబాయ్ మహేశ్తో కలిసి దినేశ్ సోమవారం రాత్రి ఇంటిబయట మంచాలు వేసుకుని నిద్రకు ఉపక్రమించారు. సుమారు ఒంటిగంట సమయంలో దినేశ్పై గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో దాడి చేశారు. పక్కనే పడుకున్న బాబాయ్ మహేశ్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా తీవ్రగాయాలయ్యాయి. ఆ వెంటనే దుండగులు పరారయ్యారు. స్థానికులు గుర్తించి జనగామ ఏరియా దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో దినేశ్ మృతి చెందాడు. మహేశ్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. నిడిగొండకు చెందిన వంగాల లక్ష్మీబాయితో భూతగాదాలు ఉన్నాయని, ఆమె అక్క కుమారుడు గొంగడి సుబ్రహ్మణ్యం సహాయంతో ఈ హత్య చేసి ఉంటారని మృతుడి తండ్రి సోమనర్సయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.