వెంగళరావునగర్ : టీసీఎస్ లో పని చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యమైన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం, లింగసముద్రం గ్రామానికి చెందిన కె.రాజశేఖర్ (25) నగరంలోని టీసీఎస్ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
కొవిడ్ కారణంగా స్వగ్రామం లోని ఇంట్లో నుంచే విధులు నిర్వహిస్తున్నాడు. దీనికి తోడు సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలకు ఆన్లైన్లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇటీవల తండ్రి చైతన్య శ్రీనివాస్తో గొడవ పడ్డాడు. మనస్తాపంతో గత నెల 30న నగరానికి వచ్చాడు.
ఎల్లారెడ్డిగూడ సమీపంలోని షిరిడీసాయి బాయిస్ హాస్టల్లో చేరిన రాజశేఖర్ ఆదివారం అక్కడినుంచి అదృశ్యమయ్యాడు. దీంతో హాస్టల్లో ఉంటున్న తోటి రూంమెట్స్ రాజశేఖర్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. నగరానికి చెరుకున్న కుటుంబ సభ్యులు కుమారుడి ఆచూకీ కోసం గాలించారు.
ఫలితం లేక పోవడంతో సోదరి కె.వెంకటలక్ష్మి దివ్య ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.