తిరువనంతపురం: ఫుడ్ డెలివరీ పార్సిల్లో పాము చర్మం కనిపించింది. దీంతో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ ఫిర్యాదుతో ఆ హోటల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు దానిని మూసివేశారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఈ ఘటన జరిగింది. ఆ నగరంలో నివసించే ప్రియా అనే మహిళ ఈ నెల 5న నెడుమంగడు ప్రాంతంలోని హోటల్ నుంచి పరోటాలు ఆర్డర్ చేసింది. ఆ ఫుడ్ ఇంటికి డెలివరీ కాగానే తొలుత తన కుమార్తెకు పరోటాలు పెట్టగా ఆమె తిన్నది. అనంతరం ఆమె ఆ పరోటాలు తినసాగింది.
అయితే పార్సిల్ పేపర్లో సగం వేలు పొడవున పాము చర్మం ఉండటం చూసి ప్రియా షాక్ అయ్యింది. భయాందోళన చెందిన ఆ మహిళ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల సూచనతో ఈ విషయాన్ని ఆహార భద్రతా అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.
ప్రియా ఫిర్యాదుపై స్థానిక మున్సిపల్ అధికారులు స్పందించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ హోటల్లో తనిఖీలు జరిపారు. అక్కడ అపరిశుభ్ర వాతావరణం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ హోటల్ లైసెన్స్ను రద్దు చేసి దానిని మూసివేశారు.