న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన మైసూర్లో వైద్య విద్యార్ధినిపై సామూహిక లైంగిక దాడి ఘటనలో ఆరవ నిందితుడిని తమిళనాడులో కర్నాటక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో శనివారం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సామూహిక లైంగిక దాడి కేసులో నిందితులందరికీ నేర చరిత్ర ఉందని, వీరు గతంలో దోపిడీలు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. గతంలో పట్టుబడిన ఐదుగురు నిందితుల్లో ఒకరు మైనర్ కావడం గమనార్హం. ఈ కేసు విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ బృందం సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసింది.
ఘటన జరిగిన సమయంలో బాధితురాలితో పాటు ఉన్న యువకుడు ఇచ్చిన సమాచారం దర్యాప్తులో కీలకంగా మారింది. నిందితులు తమిళంలో మాట్లాడారని బాధితురాలు స్నేహితుడు పోలీసులకు తెలిపాడు. ఆగస్ట్ 24 రాత్రి చాముండి హిల్స్ ప్రాంతంలో సామూహిక లైంగిక దాడికి గురైన బాధితురాలు పోలీసుల ఎదుట స్టేట్మెంట్ నమోదు చేయకుండానే నగరం విడిచివెళ్లిందని పోలీసులు సోమవారం తెలిపారు.