జగిత్యాల : జగిత్యాల మర్డర్ కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోంది. తండ్రి, ఇద్దరు కుమారుల హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఆరు కత్తులు, రూ. 9.42 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురి హత్యకు చేతబడి, ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు తేల్చారు. వనం దుర్గయ్య, చిన్న గంగయ్య, మధు, వనం పోచయ్య, వనం శేఖర్, దాసరి రాములు, బళ్లాని భూమయ్య, కడెం శ్రీనివాస్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని తారకరామనగర్కు చెందిన జగన్నాథం నాగేశ్వర్ రావు(55), రాంబాబు(30), రమేశ్(23)ను జనవరి 20న హత్య చేశారు. ఈ మర్డర్ నుంచి మరో కుమారుడు రాజేశ్ తప్పించుకున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి నాగేశ్వర్రావు చేతబడి చేస్తున్నాడని స్థానికులు అనుమానం పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన కుల సంఘంలో నాగేశ్వర్ రావు కుటుంబాన్ని టార్గెట్ చేసి.. కత్తులతో దాడి చేసి మట్టుబెట్టారు.