సికింద్రాబాద్ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళ కాపుకాసి… బస్సులు, రైళ్లు దిగి ఇళ్లకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్న ఒంటరి ప్రయాణికులను టార్గెట్గా చేసుకుని… కారు ఎక్కించుకుని పిక్పాకెటింగ్లకు పాల్పడుతున్న ముఠాకు నార్త్జోన్ టాస్క్ఫోర్స్పోలీసులు, చిలకలగూడ పోలీసులు సంయుక్తంగా చెక్ చెప్పారు.
ఐదుగురు సభ్యులతో కూడిన ముఠాను పట్టుకోవడంతో పాటు వీరి నుంచి ఓ కారు, ఆరు సెల్ఫోన్లు, రూ. 3వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు నార్త్జోన్ డీసీపీ చందన దీప్తి గురువారం వెల్లడించారు. నిందితుల్లో ఓ వ్యక్తి గతంలో జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు.
చిలకలగూడ సీఐ నరేశ్, గోపలపురం ఏసీపీ సుధీర్లతో కలిసి చందన దీప్తి గురువారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. చాంద్రాయణగుట్టకు చెందిన ఫారూక్ ఖాన్ (29), కంచన్బాగ్, హాఫీజ్బాబానగర్ వాసులు మొహమ్మద్ ఖలీద్ (23), సయ్యద్ ఖాజా(22), సల్మాన్ షరీఫ్(22), షేక్ ఇస్మాయిల్(19)లు స్నేహితులు.
మహమ్మద్ ఫారూక్ఖాన్ మైలర్దేవులపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోరీ కేసులో నిందితుడు. వివిధ పనులు చేస్తే వచ్చే ఆదాయం సరిపోపోవడంతో విలాసాల కోసం నేరాల బాటపట్టారు.అద్దెకు ఆటో కార్లను తీసుకుని నగరంలోని అత్తాపూర్, మెహిదీపట్నం, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో కారుల్లో ప్రయాణికుల మాదిరిగా తిరుగుతూ ఒంటరిగా ఉన్న ప్రయాణికులకు లిఫ్టు ఇస్తున్నట్లుగా ఎక్కించుకుంటారు.
కొంత దూరం వెళ్ళగానే అప్పటికే ప్రయాణికుల మాదిరిగానే కూర్చుని ఉన్న వీరిలో కొందరు వారి జేబులో నుంచి సెల్ఫోన్, పర్సులను దొంగిలిస్తారు. అనంతరం మరి కొంత దూరం వెళ్లగానే ఇరుకుగా ఉందని దిగి ముందు కూర్చోమంటూ దింపి తరువాత మరో ఆటో కారులో ఎక్కాలని సూచించి వెళ్లిపోతున్నారు.
విచారించగా రెండు నెలలుగా ఇదే తరహాలో కామాటిపురా, మలక్ పేట, రాజేంద్రనగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, చిలకలగూడ పోలీసుస్టేషన్ పరిధిలో ప్రయాణికులను ఎక్కించుకుని వారి వద్ద సెల్ఫోన్లను దొంగిలించినట్లుగా అంగీకరించారు. నిందితుల వద్ద నుంచి 6 సెల్ఫోన్లు, రూ.3వేల నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు.