Delhi Accident | కొత్త సంవత్సరం రోజున దేశరాజధాని ఢిల్లీ శివారు కాంజావాల్ ప్రాంతంలో 20 ఏండ్ల యువతిని కారు సుమారు 12 కిలోమీరట్ల మేర ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనలో అంజలి అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో.. అంజలి మద్యం సేవించి ఉందని, ఆమె స్పృహలో లేదని ప్రమాద సమయంలో మృతురాలితోపాటు ఉన్న ఆమె స్నేహితురాలు నిధి చెప్పింది.
కాగా, నిధి ఆరోపణలను అంజలి కుటుంబం తీవ్రంగా ఖండించింది. నిధి అబద్ధం చెబుతోందని, తన కుమార్తె మరణం కుట్రలో నిధి భాగమని ఆరోపించింది. ‘నా కూతురు ఎప్పుడూ మద్యం సేవించలేదు. ఆమె ఎప్పుడూ తాగి ఇంటికి రాలేదు. నిధి అబద్ధం చెబుతోంది. నేను నిధిని ఎప్పుడూ చూడలేదు. ఆమె పేరు కూడా వినలేదు. ఆమె ఎప్పుడూ మా ఇంటికి కూడా రాలేదు. ఆమె నా కూతురి స్నేహితురాలైతే, ప్రమాద సమయంలో అంజలిని వదిలేసి ఎలా పారిపోతుంది? ఇది పథకం ప్రకారం చేసిన కుట్ర. ఇందులో నిధి పాత్ర కూడా ఉండొచ్చు. దీనిపై సమగ్ర విచారణ జరపాలి’ అని రేఖాదేవి డిమాండ్ చేశారు.
కాగా, శవపరీక్ష నివేదికలో అంజలిపై అత్యాచారం జరగలేదని, ప్రమాదం జరిగిన రాత్రి ఆమె మద్యం సేవించిన ఆనవాళ్లు కనిపించలేదని వెల్లడైంది. అయితే, అంజలి శరీరంపై 40కి పైగా గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్ట్లో తేలింది. యువతి శరీరం వెనుక భాగం ఛిద్రమైందని, దీంతో పక్కటెముకలు బయటకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తలభాగం తీవ్రంగా దెబ్బతిందని పేర్కొన్నాయి. వెన్నెముక, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రమాదంతో షాక్కు గురవడం, తీవ్ర రక్తస్రావం వల్లే అంజలి మృతి చెందిందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.