ఖైరతాబాద్ : ఆమె మా ఆవిడే….కాదు….మా ఆవిడే అంటూ ఇద్దరు మగాళ్లు ఒకరినొకరు దూషించుకున్నారు…ఇద్దరు పిల్లలున్న ఆమె మాత్రం అతను నా భర్త కాదు…వారు నా పిల్లలు కాదంటూ వాదనకు దిగింది. ఈ విచిత్ర సంఘటనకు హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్క్లబ్ వేదికైంది.
గతంలోనే ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన భార్యభర్తల కేసు వివాదం మరోసారి రచ్చకెక్కింది. ఇద్దరు భర్తలంటూ ఎస్ఆర్నగర్ పోలీసులు తనను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ సదరు మహిళ దుర్గా సత్యాదేవి సోమవారం మీడియా ముందుకు వచ్చింది.
సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ తనకు మొదటి భర్తనని ఫిర్యాదు చేసిన వ్యక్తి తన భర్త కాదని అక్క భర్త అని, అక్క చనిపోవడంతో ఆమె పిల్లలను చేరదీయడంతో వారు తనను తల్లిగా భావిస్తున్నారని పేర్కొన్నారు. నన్ను తన భార్యనని చెప్పుకుంటున్న శశీకాంత్ వర్మ తప్పుడు కేసులో తనను జైలుకు పంపినప్పుడు మీరంతా ఏమయ్యారని, తాను పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు.
రాయుడు సత్య వరప్రసాద్ మాట్లాడుతూ సత్యాదేవి తాను ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నామని, ఆమె మీద చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఆమె పేరున భూమి ఉండటంతో దాన్ని లాక్కునేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించాడు.
శశికాంత్ వర్మ మాట్లాడుతూ దుర్గా సత్యదేవి తన భార్యేనని, ఇద్దరు పిల్లలున్నారని, తన కోసం కాకుండా పిల్లలకు తల్లి లేని లోటు తీర్చాలని తాను కోరుతున్నానన్నారు. 23 ఏండ్లు కాపురం చేసి ఈ వయస్సులో పిల్లలను వదలిపెట్టి మరో వ్యక్తితో వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు.
ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ సత్యదేవి తమ రెండో కుమార్తె అని, ఆమెకు శశికాంత్తోనే తాము వివాహం చేశామని, ఇద్దరు పిల్లలున్నారని, ఎందుకు ఇలాంటి పని చేసిందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా సమావేశం జరుగుతున్న క్రమంలో అమ్మా అంటూ ఓ బాలిక ఏడుస్తూ సత్యదేవి కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేసింది. మరో యువకుడు తాను ఆమె కొడుకునంటూ తల్లిదండ్రులతో వారు దిగిన ఫొటోలను మీడియాకు చూపడం విశేషం.