Woman Murder | శంషాబాద్ : శంషాబాద్ మహిళ హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే చేధించారు. మహిళను హత్య చేసిన నిందితురాలిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మహిళ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు తేల్చారు. ఈ కేసు వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ దొడ్డికి చెందిన వడ్ల మంజుల(45) తన భర్తతో కలిసి నివాసం ఉంటోంది. శంషాబాద్ పట్టణంలోని శ్రీనివాస్ ఎన్క్లేవ్లో ఉండే రిజ్వానాకు మంజులతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తన సోదరి పెళ్లి ఉందని చెప్పి మంజులతో రిజ్వానా రూ. లక్ష అప్పు తీసుకొని, కొన్నాళ్లకు తిరిగి చెల్లించింది. 2022లో రూ. 50 వేలు అప్పుగా తీసుకుంది రిజ్వానా. ఈ యాభై వేలకు వడ్డీ చెల్లించడం ఇబ్బందిగా మారింది. దీంతో ఈ నెల 9న మరో రూ. 50 వేలు మంజుల వద్ద అప్పుగా తీసుకుంది. గతంలో ఇచ్చిన రూ. 50 వేలకు వడ్డీ చెల్లించాలని మంజుల రిజ్వానాను కోరింది. డబ్బులు ఎక్కడికి పోవని, అవసరమైతే బాండ్ పేపర్ రాసిస్తానని రిజ్వానా నమ్మబలికింది. ఈ క్రమంలో మంజుల రిజ్వానా ఇంటికి ఈ నెల 10వ తేదీన వెళ్లింది. బాండ్ పేపర్, వడ్డీ డబ్బుల విషయంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ముందుగానే రచించిన పథకం ప్రకారం.. మంజుల కండ్లలో కారం పొడి చల్లి, చీరతో ఉరేసింది రిజ్వానా. ఇక డెడ్బాడీని ఫ్లోర్ మ్యాట్లో చుట్టి, రాత్రి 12 గంటల సమయంలో మొదటి అంతస్తు నుంచి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి తోసేసింది. అనంతరం పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి.. పెట్రోల్ పోసి నిప్పంటించింది. మంజుల శరీరంపై ఉన్న బంగారం తీసుకొని రిజ్వానా అక్కడ్నుంచి ఉడాయించింది. మంజుల సెల్ఫోన్ను హుడా కాలనీ చెట్ల పొదల్లో రిజ్వానా విసిరేసింది.
శ్రీనివాస ఎన్క్లేవ్లో ఉండే సూరాజ్ రావు.. శుక్రవారం అర్ధరాత్రి 12:40 గంటల సమయంలో డ్యూటీ ముగించుకొని ఇంటికి వస్తుండగా మంటలను గమనించాడు. దీంతో తన సహోద్యోగి జీవన్, మరో వ్యక్తి లలిత్ ప్రధాన్కు సమాచారం అందించాడు. వీరు దగ్గరికెళ్లి చూడగా.. మహిళ కాలిపోతున్నట్లు గుర్తించారు. వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కాలిపోయిన మృతదేహంతో పాటు అక్కడ లభించిన కాళ్ల మెట్టెలు, తాళం చెవులను స్వాధీనం చేసుకున్నారు. డెడ్బాడీని ఉస్మానియా మార్చురికీ తరలించారు. శంషాబాద్ రూరల్ పీఎస్లో ఓ మహిళ మిస్సింగ్ కేసు నమోదు కావడంతో.. ఫిర్యాదు చేసిన లక్ష్మయ్యను ఉస్మానియాకు పిలిపించి డెడ్బాడీని చూపించగా, ఆమె తన భార్య మంజుల అని నిర్ధారించాడు.
లక్ష్మయ్య రిజ్వానాపై అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 12వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో శ్రీనివాస్ ఎన్క్లేవ్లో రిజ్వానాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిజ్వానాను పోలీసులు విచారించగా, చేసిన అప్పులు చెల్లించలేకనే మంజులను హత్య చేసినట్లు అంగీకరించింది రిజ్వానా. అనంతరం రిజ్వారాను పోలీసులు రిమాండ్కు తరలించారు.
నిజామాబాద్ జిల్లా శాతపూర్కు చెందిన షేక్ రిజ్వాన బేగం 2010లో శంషాబాద్కు వచ్చి అప్పటి నుంచి 2017 వరకు ఎయిర్పోర్టులో పని చేసింది. 2015లో మహ్మద్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. 2017లో తన చేతికి గాయం కావడంతో ఎయిర్పోర్టులో ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండి దాదాపు 4 ఏండ్ల పాటు ఎంబ్రాయిడరీ వర్క్ చేసింది. రెండు సంవత్సరాల క్రితం ఇందిరానగర్ దొడ్డిలో కేజీఎల్ లేడిస్ కార్నర్ను ప్రారంభించింది. ఆదే సమయంలో మంజులతో పరిచయం ఏర్పడింది.