remanded
చాంద్రాయణగుట్ట : క్షుద్రపూజల పేరుతో ఇద్దరు మహిళలను లోబర్చుకొని లైంగికదాడి చేసిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గురువారం చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ వివరాలను వెల్లడించారు.
చంచల్గూడ ప్రాంతానికి చెందిన సయ్యద్ హసన్ హస్కారి (52), అతని కుమారుడు ఓల్డ్ మలక్పేట్ రైతుబజార్ సమీపంలో నివసించే సయ్యద్ అఫ్రోజ్ (23)ఇద్దరు ఏవరికైనా ఆరోగ్యం బాగలేకపోయినా..ఇంట్లో దుష్ఠశక్తులు చేరిన మంత్రాలతో దూరం చేస్తామని ప్రజలను నమ్మిస్తూ పూట గడుపుకుంటున్నారు.
ఈ క్రమంలో బండ్లగూడ తులసి నగర్కు చెందిన ఓ మహిళ (23) తరుచూ అనారోగ్యం బారిన పడుతున్నానని సయ్యద్ హసన్ హస్కారి వద్దకు వెళ్లింది. దీంతో మీకు చెడు చేయడానికి ఏవరో కుట్ర చేశారని, అందువల్లే అనారోగ్యం బారిన పడుతున్నారని నమ్మించాడు. అంతేకాకుండా మీ ఇంట్లో కూడా దుష్ఠశక్తులు ఉన్నాయని, ఇల్లు అమ్మేస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మ బలికాడు. పూర్తిగా మంత్రాలు చేస్తే పూర్తి ఆరోగ్యవంతురాలిగా అవుతాను అని నమ్మించాడు.
అతన్నినమ్మిన ఆ మహిళ నాలుగైదు ఏండ్లుగా సయ్యద్ హసన్ హస్కారి చెప్పిన విధంగా చేస్తుంది. ఈ క్రమంలో 2016 లో భర్తకు విడకులు ఇచ్చి ఒంటరిగా ఉంటుంది. ఈ మధ్యకాలంలోనే ఇల్లు కూడా అమ్మేసింది. కొన్నాళ్లుగా మహిళ ఒక్కతే కాకుండా తనకు స్నేహితురాలు అయిన మరో మహిళ (23) ను కూడా తోడుగా తీసుకెళ్తుంది. వీరిపై కన్నేసిన కామాంధులు మంత్రాల పేరుతో పూజలు చేసినట్లు నటిస్తూ లైంగికదాడికి పాల్పడ్డారు.
మంత్రాల పేరుతో సయ్యద్ హసన్ మోసం చేశాడని గ్రహించిన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు గురువారం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.మంత్రాల కోసం ఉపయోగించే సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.ఈ విలేకర్ల సమావేశంలో అదనపు డీసీపీ సయ్యద్ రఫీక్, ఫలక్నుమా ఏసీపీ మహ్మద్ మజీద్,ఇన్స్పెక్టర్ కె.ఎన్.ప్రసాద్ వర్మ,ఎస్సై గౌస్ ఖాన్ పాల్గొన్నారు.