పట్నా: ఇటీవల బీహార్లోని వైశాలీ జిల్లా హజీపూర్ సదర్ డివిజన్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. డివిజన్లోని అరారా గ్రామంలో ముఖియా (గ్రామ పెద్ద) పదవి కోసం అజయ్ భగత్, అజిత్ భగత్ బరిలో నిలిచారు. అజయ్ భగత్, అజిత్ భగత్కు చిన్నాన్న. అయితే ఆ ఇద్దరితోపాటు మరో వ్యక్తి కూడా అరారా ముఖియా పదవి కోసం పోటీపడ్డాడు. ఒకే కుటుంబం నుంచి చిన్నాన్న, కొడుకు పోటీచేయడంతో ఓట్లు చీలిపోయి మూడో అభ్యర్థికి మేలు జరిగింది.
చిన్నాన్న, కొడుకు ఇద్దరినీ ఓడించి మూడో వ్యక్తి విజయం సాధించాడు. దాంతో చిన్నాన్న అజయ్ భగత్పై అజిత్ భగత్ కక్ష పెంచుకున్నాడు. తన ఓటమికి చిన్నాన్నే కారణమని కుమిలిపోయాడు. ఆఖరికి ఆగ్రహం పట్టలేక ఈ తెల్లవారుజామున షుగర్ సిరప్, యాసిడ్ మిశ్రమాన్ని ఒక సీసాలో కలుపుకుని వెళ్లి చిన్నాన్న కుటుంబసభ్యులతో గొడవకు దిగాడు. వాళ్లంతా గుంపుగా రాగానే వెంట తీసుకెళ్లిన యాసిడ్ గుప్పి పారిపోయాడు.
ఈ దాడిలో అజిత్ చిన్నాన్న కుటుంబంలోని ఏడుగురు సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో గ్రామస్తులు వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితుల వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. బాధితులు ఇచ్చిన ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, బాధితులందరికీ 40 నుంచి 50 శాతం గాయాలయ్యాయని వైద్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు అజిత్ కోసం గాలిస్తున్నామని, అతడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.