న్యూఢిల్లీ : 14 ఏండ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన యూపీలోని ఫతేపూర్కు చెందిన వ్యక్తికి నోయిడా సెషన్స్ కోర్టు 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. గ్రేటర్ నోయిడాలోని సురాజ్పూర్లో సునీల్ అనే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాలిక పొరుగింట్లో ఉండే సునీల్ 2015 జులై 2న బాధితురాలిపై దారుణానికి తెగబడ్డాడు. బాలిక ట్యూషన్ క్లాస్కు వెళుతుండగా తనతో పాటు సమీపంలో ఉండే షాపుకు రావాలని బాలికను వెంటతీసుకువెళ్లాడు.
అక్కడ తినుబండారంలోమత్తుమందు కలిపి తనకు ఇవ్వడంతో తాను స్ప్రహ కోల్పోగా నిందితుడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక కోర్టుకు తెలిపింది. నిందితుడిని తాను సోదరుడిగా భావిస్తే ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని పేర్కొంది. ట్యూషన్ క్లాస్కు వెళ్లి బాలిక తిరిగిరాకపోవడంతో కంగారు పడిన తల్లితండ్రులు ఆమె కోసం గాలించారు.
ఈలోగా పొరుగున ఉండే సునీల్ పరారీలో ఉన్నాడని తెలియడంతో అతడి ప్రమేయం ఉందని అనుమానించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సునీల్ను పసిగట్టిన పోలీసులు అదే ప్రాంతంలో బాలిక స్ప్రహ కోల్పొయి ఉండటం గమనించారు. సునీల్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆపై జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.