కోల్కతా: విద్యార్థులను కిడ్నాప్ చేసిన కొందరు వ్యక్తులు, కదులుతున్న కారులో హత్య చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అటాను డే, అభిషేక్ నస్కర్ ఆగస్ట్ 22న అదృశ్యమయ్యారు. కోల్కతా హైవే సమీపంలోని కాలువలో విద్యార్థుల మృతదేహాలు లభించాయి. అయితే మార్చురీకి తరలించిన బసిర్హాట్ పోలీసులు, గుర్తు తెలియని మృతదేహాలుగా పేర్కొన్నారు. ఈ నెల 5న ఆ మృతదేహాలు ఆ ఇద్దరు విద్యార్థువేనని పోలీసులు గుర్తించారు. కాగా, విద్యార్థుల మిస్సింగ్పై తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన బాగ్యుహతి పోలీస్ స్టేషన్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తల్లిదండ్రుల ఆగ్రహంతో ప్రభుత్వం స్పందించింది. బాగ్యుహతి పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ను తొలగించింది. ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించింది.
మరోవైపు విద్యార్థుల హత్యకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. యువకులైన అభిజిత్ బోస్ (25), షమీమ్ అలీ (20), సాహిల్ మొల్లా (20), దిబ్యేందు దాస్ను కోర్టలో ప్రవేశపెట్టారు. అయితే ప్రధాన నిందితుడు సత్యేంద్ర చౌదరితోపాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి ఉంది. బైక్ కోనుగోలు జరిగిన రూ.50,000 ట్రాన్సాక్షన్ విద్యార్థుల కిడ్నాప్కు ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. అయితే మిగతా కోణాల్లో కూడా విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.
కాగా, నిందితుల అరెస్ట్ తర్వాతే విద్యార్థుల హత్య గురించి దర్యాప్తులో తెలిసిందని పోలీసులు తెలిపారు. ఆగస్ట్ 22న తామంతా కలిసి రాత్రి 8-10 గంటల మధ్య కదులుతున్న కారులో ఇద్దరు విద్యార్థుల గొంతునులిమి హత్య చేసినట్లు నిందితుడు అభిజిత్ బోస్ చెప్పినట్లు పేర్కొన్నారు. అనంతరం హైవేపై కారులో వెళ్తూ కాలువలో రెండు చోట్ల మృతదేహాలను పడిసినట్లు అతడు నిజం ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు.