అగ్రరాజ్యం అమెరికాలో బాగా బిజీగా ఉండే డెంటల్ ఆస్పత్రుల్లో అది కూడా ఒకటి. విస్కాన్సిన్లో ఉండే స్కాట్ చర్మోలీ (61) అనే డాక్టర్ తన పేషెంట్లకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చేవాడని పేరు. ఇటీవలే తన ఆస్పత్రిని చర్మోలీ అమ్మేశాడు. కొత్తగా వచ్చిన యాజమాన్యం పాత పేషెంట్ల ఫైల్స్ తిరగేసింది. అంతే వాళ్లంతా షాకైపోయారు.
ఎందుకంటే విస్కాన్సిన్లో సగటున వంద మంది పేషెంట్లలో ఆరుగురికి క్రౌన్స్ (పళ్లకు వేసే క్యాపులు) వేస్తారు. కానీ చర్మోలీ ఆస్పత్రిలో మాత్రం ప్రతి వంద మంది పేషెంట్లలో ఏకంగా 32 మందికి క్రౌన్స్ వేశాడు. దీనిలో ఏదో మోసం ఉందని అనిపించడంతో సంబంధిత అధికారులు ఫిర్యాదు చేశారు. తీరా చూస్తే.. చర్మోలీ తన పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో కావాలని పళ్లు చెక్కేసేవాడని తేలింది.
ఆ తర్వాత ఎక్స్రేలు తీసి పళ్లకు క్రౌన్స్ వేయాలని చెప్పేవాడు. ఇలా చెప్పి లక్షల డాలర్లు ఆదాయం సంపాదించాడు. ఆ తర్వాత ఆస్పత్రి అమ్మేశాడు. ‘‘ఆయన ప్రొఫెషనల్ అనే ఉద్దేశ్యంతో డాక్టరు చెప్పిన మాటలు నమ్మాను. ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు’’ అని ఒక పేషెంట్ అన్నారు. దీనిపై ప్రస్తుతం విస్కాన్సిన్ కోర్టులో కేసు నడుస్తోంది. అయితే చర్మోలీ సంపద మొత్తం కష్టపడి సంపాదించుకున్నదేనని ఆయన తరఫు లాయర్ వాదిస్తున్నారు.