రాఖీ పండుగ రోజు వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి
దుఃఖసాగరంలో బాధిత కుటుంబాలు
అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ రోజు పలు జిల్లాల్లో అనూహ్య విషాదాలు చోటుచేసుకొన్నాయి. చెల్లి చేత రాఖీ కట్టించుకుందామన్నా ఆ వ్యక్తి ఆశ అంతలోనే ఆవిరైంది.. మరో ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయి ఇన్నాళ్లు అమ్మ మ్మ ఇంట పెరిగి, ఇటీవలే చెల్లికి పెండ్లిచేసిన అన్న రాఖీ పండుగ రోజే కారు ప్రమాదంలో మృతి చెందడం తీరని దుఃఖాన్ని మిగిల్చింది.. ఇంకో ఘటనలో తమ్ముడికి రాఖీ కట్టేందుకు బయలుదేరిన ఓ అక్క బైక్ పైనుంచి పడి తిరిగిరాని లోకాలకు వెళ్లింది.. మరో చోట పండుగ రోజు అన్నకు రాఖీ కడుదామని వస్తే నిరాకరించడంతో మనస్తాపంతో చెల్లెలు ప్రాణాలు విడిచింది.. రాఖీ కడుదామనుకున్న సోదరుడు ఉరేసుకొన్న దృశ్యంతో ఓ చెల్లెలు షాక్కు గురైంది.. పండుగకు ముందురోజు సోదరుడి మరణంతో కన్నీరుమున్నీరైన అతని అక్కాచెల్లెళ్లు మృతదేహానికే రాఖీలు కట్టి అంతిమ వీడ్కోలు పలికారు. ఇలా అనుకోని ఘటనలతో ఆయా కుటుంబాలు తీరని విషాదంలో మునిగిపోయాయి.
కారులో చెల్లి వద్దకు వెళ్తుండగా..
తొడబుట్టిన చెల్లితో రాఖీ కట్టించుకునేందుకు వెళ్తున్న యువకుడు మృత్యుఒడికి చేరాడు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిర్సపల్లికి చెందిన వేల్పుగొండ రాకేశ్(26) తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించారు. చెల్లి రమ్యతో కలిసి అమ్మమ్మ దగ్గర పెరిగారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లికి చెందిన వ్యక్తితో రమ్యకు వివాహం జరిపించాడు. ఆదివారం రాఖీ పండుగ కావడంతో చెల్లితో రాఖీ కట్టించుకొనేందుకు స్నేహితుడి కారులో పొత్కపల్లికి వెళ్తున్నాడు. ఓదెల మండలం కనగర్తి శివారులో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెరువులో పడిపోగా రాకేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. నిర్జీవిగా పడి ఉన్న సోదరుడి మృతదేహంపై పడి రమ్య రోదించిన తీరు అక్కడున్నవారిని కలిచివేసింది.
తమ్ముడికి రాఖీ కట్టేందుకు వెళ్తూ..
తమ్ముడికి రాఖీ కట్టేందుకు వెళ్తూ బైక్ పైనుంచి పడి అక్క మృతి చెందింది. జనగామ జిల్లా తరిగొప్పులకు చెందిన గోలిగంటి కుమార్-లత దంపతులు హైదరాబాద్లోని గాజులరామారంలో నివాసం ఉంటున్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరులో ఉంటున్న తమ్ముడు మహేందర్కు రాఖీ కట్టేందుకు లత తన కొడుకు భాను, కూతురు వైష్ణవితో బైక్పై బయలుదేరింది. చేర్యాల మండలంలోని ముస్త్యాల సమీపంలో రోడ్డుపై గుంతలు తప్పించే క్రమంలో లత ఒక్కసారిగా బైక్ పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడింది. హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో లత(44) మృతి చెందింది. పండుగ పూట తమ్ముడి వద్దకు వెళ్తూ అక్క మృతి చెందడంతో మద్దూరు, తరిగొప్పులలో విషాదం నెలకొంది.
అన్న రాఖీ వద్దన్నాడని..
అన్న రాఖీ కట్టుకోలేదని మనస్తాపం తో ఓ మహిళ ఆత్మహత్య చేసుకొన్నది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మాణిక్ప్రభు వీధికి చెందిన బసన్న కుటుంబంతో చెన్నారెడ్డినగర్లో నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వీరింట్లో మూడు నాలుగు రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. కాగా, బసన్న కుమార్తె మమత (20) అన్న రమేశ్కు రాఖీ కట్టేందుకు వెళ్లగా అతను నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన మమత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది.
రాఖీ కట్టి అంతిమ వీడ్కోలు
నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం మాలగూడేనికి చెందిన చింతపల్లి లక్ష్మయ్య (59) అనారోగ్యంతో శనివారం మృతిచెందాడు. రాఖీ పండుగకు ఒక్కరోజు ముందుగా మృతి చెందడంతో అతని ఐదుగురు అక్కాచెల్లెళ్లు కన్నీరుమున్నీరయ్యారు. ఇంటికి వచ్చి తమ సోదరుడికి రాఖీ కట్టాలనుకున్నామని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని విలపిస్తూ ఇద్దరు అక్కలు, ముగ్గురు చెల్లెళ్లు సోదరుడి మృతదేహానికి రాఖీ కట్టి కన్నీటి వీడ్కోలు పలికారు.
ఫ్యాన్కు వేలాడుతూ సోదరుడు..
పండుగ పూట సోదరుడికి రాఖీ కడుదామని సంతోషంగా వచ్చిన ఓ మహిళకు ఊహించని ఘటన ఎదురైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చింతల్ చంద్రానగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఎం శ్రీకాంత్ (35)కు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల కిందట భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. ఆదివారం శ్రీకాంత్ సోదరి రాఖీ కట్టేందుకు ఇంటికి వచ్చి తలుపులు తీసేందుకు ప్రయత్నించగా లోపల గడియపెట్టి ఉంది. బలవంతంగా తీసి చూడగా శ్రీకాంత్ ఫ్యాన్కు ఉరివేసుకొని విగతజీవి గా వేలాడుతూ కన్పించాడు. రాఖీ కడుదామని వస్తే సోదరుడు మృతి చెందడంతో ఆ కుటుంబం తీరని విషాదంలో మునిగింది.