చెన్నై: లేడీస్ కంపార్ట్మెంట్ నుంచి దిగమన్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ను ఒక వ్యక్తి కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం రాత్రి 8.45 గంటలకు చెన్నై బీచ్ నుంచి చెంగల్పేట్కు వెళ్లే లోకల్ ట్రైన్ మహిళా కంపార్ట్మెంట్లో రక్షణగా, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)కు చెందిన మహిళా కానిస్టేబుల్ ఆశీర్వ విధుల్లో ఉంది. ఆ రైలు చెన్నై బీచ్ స్టేషన్లో ఆగి ఉండగా ఒక వ్యక్తి లేడీస్ కంపార్ట్మెంట్లోకి ఎక్కాడు. దీంతో ఇది లేడీస్ కంపార్ట్మెంట్ అని, దిగి వేరే కంపార్ట్మెంట్లోకి వెళ్లాలని ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఆశీర్వ అతడితో అన్నది. అయితే ఆగ్రహించిన ఆ వ్యక్తి తన వద్ద ఉన్న కత్తితో ఆమె మెడపై పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, గాయపడిన ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఆశీర్వ కూడా వెంటనే రైలు నుంచి కిందకు దిగింది. ఒక వ్యక్తి తనపై కత్తితో దాడి చేసిన విషయాన్ని అక్కడ ఉన్న మిగతా ఆర్పీఎఫ్ పోలీసులకు తెలిపింది. దీంతో గాయపడిన ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
మరోవైపు ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఆశీర్వపై కత్తితో దాడి చేసిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడ్ని గుర్తించేందుకు ఆ రైల్వే స్టేషన్తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.