హైదరాబాద్ : కర్నాటక బీదర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు హైదరాబాద్ వాసులు దుర్మరణం
చెందారు. ఎర్టిగా కారు వెనుక నుంచి కంటైనర్ను ఢీకొట్టింది. ఇదే ప్రమాదంలో మరో ఐదుగురు గాయాలపాలవగా.. ఆసుపత్రికి తరలించారు. బీదర్ తాలూకాలోని బంగూర్ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులు హైదరాబాద్ బేగంపేటకు చెందిన గిరిధర్ (45), అనిత (30), ప్రియ (15), మహేక్ (2), డ్రైవర్ జగదీశ్ (35)గా గుర్తించారు.
కలబురిగి జిల్లా గాన్గపూర్ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకునేందుకు హైదరాబాద్కు చెందిన గిరిధర్.. పది మంది కుటుంబ సభ్యులతో కలిసి ఎర్టిగాలో బయలుదేరాడు. ఈ క్రమంలోనే బంగూర్ సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. గీత, రజిత, ప్రభావతి, షాలిని, హర్షవర్ధన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గిరిధర్ పోలీస్శాఖలో పని చేస్తున్నట్లుగా సమాచారం. ఘటనపై మన్నల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.